అమ్మ ఓడిపోయింది

టీచర్  వాడు చచ్చి పోయాడు"ఆనందంగా చెప్పింది సంతోషి.
"వారం రోజులు బడికి రాలేదు ఎందుకు అంటే .. ఎవరో చచ్చిఫోయారంటవేం" మందలించింది టీచర్.
"అవును టీచర్, నేను పుట్టినందుకు మా అమ్మను కొట్టి.. అమ్మను వదిలేస్తానని. నన్ను అక్కను చంపుతానన్నవాడు. తాత వాడి కాళ్ళు పట్టుకొని బతిమిలాడితే అక్కను మాత్రమే సాదడానికి  ఒప్పుకున్నవాడు .. ఇన్నేళ్ళు నాకు అమ్మను దూరం చేసినవాడు చచ్చాడు టీచర్"ఉద్వేగంగా  చెప్పింది సంతోషి.
జలధి టీచర్ ఆ పసిదాని పరిస్థితి కొంత అర్థం చేసుకుంది.
"సరె సరె నువ్వెందుకు ఎళ్ళావ్ వాడు చస్తె, వాడంటె నీకసహ్యం కదా" టీచర్ అడిగింది.
"అదె టీచర్ వాడు చస్తె చూడ్డానికి  కూడా రానన్నదట మా అక్క . అంతగా హింసపెట్టాడు అక్కను వాడు.ఏదొ స్నేహగృహం అని బాధిత మహిళల కోసం పనిచేస్తుందట అక్కడ తలదాచుకుంటున్నది. మా తాత పట్టుపట్టి తీసుకు పొయ్యాడు . నేనే తలకొరివి పెట్టి వచ్చావాడికి" గాలి పీల్చుకుంది ఆఅమ్మాయి.
పిల్ల వెంటే తోడుగా వచ్చి బయటె నిల్చున్న నరసయ్య ఆ మాటలన్ని వింటున్నడు.
మరి మీ అమ్మ మీతొ వచ్చిందా.?అడగింది టీచర్.
"రాలేదు. ఐదు సంవత్సరాలు కాంట్రాక్టుకు మా అమ్మను  పనిమనిషిగా కుదిర్చి డబ్బులు తీసుకున్నాడు వాడు. ఇంకా రెండేళ్ళ వరకు రాలేదు" బాధగా  చెప్పింది సంతోషి.
"బాధ పడకు సంతోషి. నేను నిన్ను చదవిస్త మా ఇంటికి రామ్మా,." ధైర్యం చెప్పింది.
"లేదు టీచర్ మా తాతకు ఎవరున్నరు నేను తప్ప. నాకు ఏఅవసరం వచ్చినా  మీ దగ్గరికె వస్తాను" అమ్మ మనసున్న సంతోషి అన్నది.
నీకు మీ తాతమీద మీ అమ్మ మీద కోపం లేదా.." అడిగింది జలధి.
తాత సగటు తండ్రె కదా తన బిడ్డ కాపురం సక్క చేసిండు. మా అమ్మమ్మ పిసరంత ధైర్యం నన్ను కాపాడింది.అమ్మకు ధైర్యం చెప్పె వాళ్ళులేరు చదువు లేదు భర్తకు ఎదురు చెప్పలేక నరకం చూసంది. టీచర్ మీ వంటి వారు ఇచ్చె చైతన్యం నా లాంటి వాళ్ళను కీచక సమాజం నుండి కాపాడి., ఆత్మ విశ్వాసాన్నిచ్చి అమ్మను తాతను క్షమించె దయాగుణం నేర్పింది. సంతోషి మాటలు వింటున్న నరసయ్య గతంలోకి జారుకున్నడు.
                ***
అమ్మా...అమ్మా... అమ్మా...
అంట  ఏడుస్తాంది.. పసిది.
అమ్మ నేనేం సేయనే అంట ఏడుస్తాంది.పసిదాని తల్లి..
అయ్యో.. తల్లి ఏమి సెప్పనే బిడ్డల్లారా అంట ఏడస్తాంది అరవై ఏళ్ళ ముసలమ్మ.
కొన్ని వందల సార్లు మనసులో అదె అనుకుంట ఏడిసిన్రు.
రాత్రంత ఏడస్తనే ఉన్నరు ముగ్గురు. ఎవ్వరు నిద్ర పోలేదు. వాకిట్ల పండుకున్నమల్లయ్య కోడికూతకు లేసి ఇంట్లకు వచ్చిండు.
సంటిది జరంతో అమ్మా అమ్మా అని ఏడవడం సూసిండు. మిగిలిన ఇద్దరు కండ్లు తుడుసుకున్నరు మల్లయ్యను సూసి.
ఏడుసుకుంట కూసుంటె ఏమయతది ? పసిదాన్ని మీఅమ్మకిచ్చి పెద్దదాన్ని లేపి బయలెల్లు బిడ్డా ! పట్నం బండి ఏల్లయ్యింది. అన్నడు నరసయ్య.
తల్లి బిడ్డలు ఉలికి పడ్డరు. అనుకున్నంత అయ్యింది.., తమ ప్రమేయం లేకుండనే తమ జీవితాల నిర్ణయిం జరిగింది.
ఒక నిర్ణయం జరిగి పోయింది. తల్లి బిడ్టల జీవితాలను శా సిస్తూ ,..
అల్లుడి షరతుకు నరసయ్య ఆమోద ముద్ర వేసిండు.
ఏదన్న పని సేసుకుంట నేను మీదగ్గరె ఉండి నాయిద్దరు పిల్లల్ని సాదుకుంట నాయినకు సెప్పమ్మా,..
బలహీనగొంతుకతో అడిగింది సంటిదాని తల్లి.
నరసయ్య వైపు నిస్సహాయంగా  భయంతోచూసింది ముసలమ్మ.
ఏందది సెప్పేది ఏం పని చేస్తవు ఎట్ల సాత్తవ్ ఇద్దరాడ పోర్లను. మొగన్ని వదలి ఒంటరిగ బతుకుతవా.. లోకం ఊకుంటదా,..పెద్దదాన్ని తీస్కరమ్మనె గదానీ పెనిమిటి చెప్పిండు.చంటి దాన్ని ఏ అనాధ ఆశ్రంలన్న ఏస్తంలే మేము నువ్ బయలెల్లు అన్నడు నరసయ్య.
ఎర్రకోడిపెట్టను కోసి కూరొండు.. కంచెకున్న సొరకాయపులుసు పెట్టు అన్నంత సులువుగా,.
నాయినా ... అన్నది దీనంగ సంటి పిల్ల తల్లి.
ఏందె మాలావ్ ఇదయతన్నవ్.. నీ మొగడు మంచోడు సంటిదాన్నొదలిపెట్టి వస్తె నీతొ కాపురం చేస్తన్నడు పెద్దపొల్లను సాత్తన్నడు. లేక పోతె ఇద్దర్ని తీస్క పొయ్యి మీ అత్తతో కలిసి మీ యారాలు బిడ్డల సంపినట్టు సంపితె ఏమి చేస్తవ్ అన్నడు నరసయ్య. బ్రహ్మాస్త్రం ఉపయోగించ బడింది పిచ్చుక మీద. సంటిదాని తల్లి నోరెత్త లేదు. నరసయ్య పెద్దపొల్లను తల్లిని బొంబయి తీస్కపొయ్యి అల్లునికి ఒప్పజెప్పి వచ్చి గాలి పీల్చుకున్నడు.
సంటిది పదినెలల పిల్ల.పుట్టినప్పట్నించి గొడవలె ఆడపిల్ల పుట్టిందని.
  పసిపిల్లను ఏ గుడి కాడొ బస్ స్టాండ్లనొ వదిలేసి వస్తన్నడు నరసయ్య.  ముసల్ది ఒప్పుకోలె పిల్లను తీస్కొని బాయిల పడతా అన్నది.
వచ్చె పించను నీకు నాకె సాలదు..
ఈ ముసలతనంల సంటిదాన్ని ఎట్ల సాత్తవె ముసలి ముండ అని తిట్టిండు. చాతకాన్నాడు చూద్దాం..మొండికేసింది ముసల్ది..
                  ****
తాతా  తాతా నువు యింటికి పో బడయినంక వస్త అన్నం తిని మందులేసుకో అన్న పసిదాని మాటలతో గతం నుండి బయట పడ్డడు నరసయ్య ఇంటి దారి పట్టిండు. ముసల్ది ఈ మధ్యనె కాలం చేసింది. కిడ్నీలు పాడయి.
పసిదానికి పదిహేనేళ్ళు పదో తరగతి చదువుతోంది . పేరు సంతోషి . మా ఇంట్లొ ఉండమ్మా నేను చదివిస్త అన్న టీచర్ తో మా తాతకు ఎవరున్నరు? నేను మీ దగ్గరికొస్తె.. అవసరమున్నపుడు మీ దగ్గరికే వస్త టీచర్ అన్న సంతోషి మాటలకు నరసయ్యకు దుఃఖం తన్నుకొచ్చింది.
ఈ అమృతపు అంకురాన్ని మురికి కాలువల కలుపుదామనుకున్నడు. ముసల్ది చచ్చి ఏడుందొ ఈ అమ్మ చెట్టును కాచింది. అదే తనకు నీడనిచ్నేందుకు నిలబడింది అనుకుంట కళ్ళు తుడుచుకున్నడు నరసయ్య.
ఆడపిల్లలను, చెట్లను కాపాడుదాం ప్రకృతిని రక్షిద్దాం నినాదాలచ్చుకుంట రోడ్డు దాటుతోంది బడిపిల్లలగుంపు.
                  ****
జ్వలిత.
అక్షరవనం.
202.శేషసాయి ప్యారడైస్.
విజయనగర్ కాలనీ-2.
ఖమ్మం-2.
Cell.9989198943
E.mail. jwalitha2020@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

జిల్లేడు కాయ(కరోనా కథ))