పుస్తక సమీక్ష
"ఆదివాసి రాసిన ఆదివాసీ శతకం"
శతకం అంటే మనకు భక్తి శతకాలు, నీతి శతకాలు, కొండొకచో శృంగార శతకాలు గుర్తుకు వస్తాయి. కానీ, అస్తిత్వ శతకాలు అసలు లేవు అనవచ్చు. కోసు ప్రసాదరావు తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం మండలం, బందపల్లి ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు. "ఆదివాసీల" మీద శతకం రాసిన వాళ్ళలో మొదటివారై ఉంటారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు మొత్తం నాలుగు శతకాలు రచించారు. అవి (1) మాతృశ్రీ గండి పోశమ్మ శతకం, (2) శ్రీ షిర్డి సాయి శతకం (3) శ్రీ రంప మల్లిఖార్జున శతకం, (4) ఆదివాసి శతకం, ఇంతకుముందు రాసిన మూడు ఆధ్యాత్మిక శతకాలు అయితే జన్మతః ఆదివాసి అయినవారు "ఆదివాసీల శతకం" రాయడం అభినందనీయం. దీనిని వారి తల్లి దండ్రులకు అంకితమిచ్చారు. ఆదివాసీల స్థితిగతుల గురించిన సామాజిక అంశం పై రాసిన శతకం ఇది. ఇందులో మొత్తం 108 పద్యాలున్నాయి. "మకుటం పల్లెవాసి మాట పసిడి మాట"
శతకం ప్రారంభానికి ముందు అల్లూరి సీతారామరాజుకు నివాళి అర్పించారు. ముందు మాటలు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, బందపల్లి ఎమ్పిటిసి కారం బాపన్న దొర,ఏజెన్సీ సర్పంచుల అధ్యక్షుడు పండా రామకృష్ణ, కర్రా కార్తికేయ శర్మ రాశారు.
మొదటి ఏడు భరతమాత గొప్పతనం, రామాయణ, భారతాల పల్లెలు, పాడి పంటలు వంటి వానిని పొగిడారు. ఎనిమిదవ పద్యంలో ఆదివాసీల తెగల గురించి చెప్పారు. కోయలు, వల్మీకి,కొండరెడ్లు, భగత కొండకాపు, కొండ దొరలు, కొండ కమ్మరలుంటారని వివరించారు.
తొమ్మిదవ పద్యంలో ఆదివాసి అంటె అమలిన సంతతి అని మాయ మర్మాలు తెలియని వారిని నీతి ధర్మమునకు కట్టుబడి ఉంటారని వారి స్వభావాన్ని వివరించారు.
ఆదివాసీలలో చట్టాల తెలియవు, న్యాయస్థానాలు ఉండవు. కోయగూడెం పెద్దలు గ్రామ పెద్దగా న్యాయంతో తీర్పులు చెబుతుంటారు. వారికి విద్య అందుబాటులో లేదన్న విషయం పదకొండవ పద్యంలో ఇచ్చి పుచ్చుకోవడం వారి సంప్రదాయం. “కలం కాగితం కలలోన ఎరుగరు” అంటారు.
"అడవిలోని బాట ఆదివాసుల వేట - గిరులలోని పంట సిరులు ఇంట - వంట వార్పులన్ని పంట చేలలోనంట" - అంటూ ఆదివాసీ ప్రజల జీవన చిత్రాన్ని మన ముందుంచుతారు.
పోడు వ్యవసాయంలో ఆదివాసీల పంటల గురించి వివరించారు.
కొండ పోడు నందు కొర్ర, సామలు, జొన్న, కంది వంటి పప్పు దినుసులు, అడవిలో దుంపలు, ఆకుకూరలు వారి పంట. చింతపండు, సీకాయ, చీపుర్లు, నల్లజీడి పిక్కలు, రెల్లి చెక్క,అడ్డనార, తేనె మొదలైన వాటిని ఆదివాసీలు సేకరిస్తారు. కోవెల జిగురు, నల్లమద్ది చెక్క, చిల్ల పిక్క, ముసిడి గింజలు, ఉసిరికాయలు, ప్రిడెము, కొమ్ము కూర, వెదురు బియ్యము,బలుసు కూర, మాడి టెంకల పులుసు, గొడ్డు కూర వంటి వంటకాలు వారి ఆహార దినుసుల గురించి చెప్పారు.
"చింతగింజ పప్పు చితికి జావను గాచి, గురుగు కూర నంజి ఆరగింతురు" అని వివరిస్తారు. తాటి మొవ్వకూర - తంగెడు గింజలు - చీమ చింతకాయ, చేమకూర - చింత చిగురు పప్పు, చేమ దుంపల కూర, పుట్ట కొక్కు కూర, పూరేడు మాంసము, జొన్న సామ అన్నము, వెదురు కొమ్ము కూర రుచిని మాటల్లో చెప్పలేము అంటారు.
చింతకాయ పులుసు - సావిడేల పులుసు - సామల కూడు, పచ్చిమిరపకాయ పచ్చడి రుచులు, అడవి దొండ దుంప, ఆదొండకాయి, ఇసుక రాతి కూర, ఈత పండ్లు వంటి తిండి పదార్థాలు వారి ఆహారపు అలవాటును తెలుపుతాయి.
(16 నుండి 22) వరకు చెప్పారు.
గుంటరోలు, తిరగలి వంటి వస్తు సముదాయము పండుగ రోజు ఆనందం గురించి "పర్వదినము నాడు పడుచులందరు గూడి - ఆటలందు రేల పాటలందు - ఆడి పాడి గెలిచి ఆనంద మిత్తురు" అంటారు.
తాటి కల్లు, విప్పసార విందులో తాటితేగను మిర్చిరోటలో దంచి నంజుకుంటూ తన్మయత్వం చెందుతారని
విందుల్లో ఆడ మగ తేడ లేకుండ 'కల్లు'ను సేవించి ఆరగిస్తారని, పండుగలు ఉత్సవాల్లో పట్నంవాసులు ఆదివాసీ మహిళలను మోసం చేయడం. ఆదివాసీల గూడెంలలో జీవనం గుడిసెల
31 పద్యం లో.. తలుపులేని ఇండ్లు, తాటాకుల గుడిసెలు - ఉట్టి మీద కూడు ఉలవచారు - అగ్గి నెగడు ఇంట ఆల మందలు తోడ.
అడవులలో నివాసముండే వీరికి అగ్ని నెరడు 360 రోజులు వెలుగుతూనే ఉంటాయి. అడవి జంతువులు జన ఆవాసాలకు రాకుండా ఉండేందుకు ఇవి రక్షణ నిస్తాయి.
32 పద్యం లో.. మొలకు గోచిపెట్టి, తలకు పాగా చుట్టి - చెవిని అడ్డ చుట్ట, చేతి విల్లు, చంకలోన కత్తి
33 పద్యం లో.. “ముక్కుకు అడ్డ పూస, మురుగులు, కడియాలు - పచ్చబొట్టు, నుదుట ఏడుబులందు - చెవికి పోగులుండు, శిగ తోడ చెలికాడు” అంటూ స్త్రీ, పురుషుల అలంకారం గురించి చెప్పారు.
34 పద్యం లో.. పెండ్లి చూపులేదు పెద్దలే కుదిరించు – వెర్రిదైన, మూతి మొర్రియైన - తల్లిదండ్రులాజ్ఞ తప్పలే గిరిజనులే అంటారు.
57 పద్యం లో.. ఏటి చెలిమల తాగు నీరు సేకరణ గురించి చెప్తూ మట్టికుండ వంటి మాయి జీవితమని నైరాశ్య చెందారు.
40 పద్యం లో.. చీమగుడ్ల కూర? అన్నారు. చొడి, గంటె జావ, జొన్న కూడు, పనస తొనలు వంట గురించి చెప్పారు.
అడవి దున్నల కొమ్ములతో తలపాగా తయారుచేసి దానికి నెమలీక లుంచి కొమ్ము డోలు ఆట గురించి
41 పద్యం లో.. మూఢ భక్తి గిరిజనులది శివభక్తులు అంటారు.
48 పద్యం లో.. చెట్టుకు, పుట్టకు నియమ నిష్టలతో పూజ చేసే వీరికి పాపభీతి కూడా ఎక్కువ.
44 పద్యం లో.. ప్రకృతి దేవతలకు కొత్త పంటను ఫలహారంగా కొర్ర, సామి, కంది, చిక్కుడు వండి సమర్పిస్తారు.
45 పద్యం లో.. వానల కోసం పాడే పాట “గుమ్మి టీ”లు అవి చాలా మధురంగా
46 పద్యం లో.. భూదేవి పండుగ పేరుతో కోళ్ళను, పందులను కోసి పండుగ
47 పద్యం లో.. కోలాట పండుగలకు కోళ్ళు, మేకలు కోసి వరాలడుగుతారు.
48 పద్యం లో.. మామిడాకు తోరణాలు కట్టి మంకెన పూలు దూపదీపాలతో మేకపోతును బలిస్తారు.
52 పద్యం లో.. వేట సమయంలో దూలగొండి దెబ్బ, దోమకాటుకు రోగాలతో వైద్య సౌకర్యం లేక బాధపడతారు.
53-56 పద్యం లో.. నాటు వైద్యులు, మంత్రగాళ్ళు మోసం చేస్తారు.
57 పద్యం లో.. భూత వైద్యులను నమ్మారు. ఇప్పుడు ఆంగ్ల వైద్యులకు అలవాటు పడ్డారు అంటారు.
63 ప లో. కొమ్ము దాసరి చెట్టు కొమ్మ పై కూర్చుని పాటలు పాడి బిక్ష పెట్టక పోతే పడి చస్తానని బెదిరిస్తాడని వివరించాడు.
64 ప లో. అడవి గిరిజనుల హక్కు కాని, అటవీ శాఖ అవినీతి వారిని దోచుకున్నదంటారు.
66-68 వరకు పద్యాలలో
గిరిజనుల అలంకారాల గురించి, సహజంగా నిష్కల్మషంగా ఉంటారని, వారి అమాయకతను వివరిస్తే
68 పద్యంలో మన్నె ప్రాంతంలో పని చేసిన ఉపాధ్యాయులకు వందనాలు సమర్పిస్తారు.
69-70 ప లో.. ఇప్పుడు మెరుగైన పరిస్థితిని వివరిస్తూ పాఠశాలలు వెలిసి, విద్య నేర్చిన గిరిజనులు చట్ట సభలకు చేరారని,
71-72 పోడుసాగు వదలి పొలాలు సంపాదించారు. భల్లూక వేట మాని విద్య నేర్చారు.
73-74 గిరిజన పురుషులు ముడి పెట్టిన సిగలు కత్తిరించి. చక్కగా క్రాపులోకి వచ్చి, ఆదివాసి స్త్రీలు మూడ బారల చీర రైక లేకుండేవారు. ఇప్పుడు నిండైన వస్త్రధారణతో ఆనందంగా కనిపిస్తున్నారంటారు.
75 ప లో పంట పొలాల్లో కూలీలుగా ఉండే ఆదివాసీలు చట్ట సభల్లో పదవులు పొందారని,
76 ప లో.. నాటు మంత్రసానుల నైపుణ్యాన్ని చెప్తే
77-78 ప లో.. గ్రామ దేవతల పూజలు గంగ జాతరల్లో శివమూ వారు బ్రహ్మ విష్ణువులను పూజిస్తున్నారని అంటారు. బ్రాహ్మణీకం జొరబడినదని చెపుతారు పరోక్షంగా.
79-80 ప లో.. ఆదివాసీల బంధు ప్రేమను - పట్నాలకు వలస వెళ్ళటాన్ని గురించి చెప్తారు.
85 ప లో.. నాగరికత ఎంత నేర్చినా గిరిజన సంస్కృతిని మరవద్దని హెచ్చరిక చేస్తారు.
83-84 పద్యాలలో ఆదివాసీలపై వలస మతాల ప్రభావం, హితం లేని మతం. మతం పేర ఉగ్రవాదం వద్దంటారు.
81-82 ప లో.. ఆదివాసీలకు విద్య ప్రాధాన్యత చెప్పారు. బాల గిరిజన విద్యార్థి విద్య నేర్చి ఉద్యోగి యై తిరిగి రావాలని ఆశించేవారు.
86 ప లో.. పితృ స్వామ్యాన్ని ప్రశ్నిస్తే.
87 ప లో.. విద్య, ఇతర అభివృద్ధి పథకాల గురించి చెప్తారు.
88 ప లో.. గిరిజనాభివృద్ధి కోసం ఏర్పడ్డ ITDA ను ఎంతో ఉపయోగపడిందంటూనే
89 ప లో.. గిరిజనేతర ఉద్యోగులు ITDA లో ఉంటున్న సంగతి
90 ప లో.. ITDAలో అవినీతిని ప్రశ్నిస్తే వచ్చే బదిలీ భయం గురించి చెప్పారు.
91 నుండి 108 పద్యం వరకు ఉత్తరాలు కనుమరగ్వడం చిన్న పిల్లల పై సెల్లు ప్రభావం, పెరిగిన సాంకేతిక ఫాక్స్ వచ్చి టెలిగ్రామ్లు అంతరించిన సంగతి
సెల్ ప్రభావంతో, మాతృ భాష గొప్పదన్న మమ్మీ డాడీల భాష, పరభాష వ్యామోహ, ఆరోగ్యకర ఆహార నియమాలు, ధూమపాన, మద్యపాన అనర్థాలు, బాల్యం గొప్పతనం, దానాల్లో అన్న, విద్య, రక్త దానాల గురించి , పేదరికం - తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానం, నైతిక విలువలు వ్యక్తిగత క్రమశిక్షణలను చెప్పి చివరి పద్యంలో అమ్మ ప్రేమతో ముగించారు.
66 ప లో.. పద్యాలు ఆదివాసీల గురించి మిర్చి (26) చికెను (27) ఫారెష్టు (64) టెంటు - టేబుళ్ళు (65) ఐటిడిఏ - (88) ట్రైబర్ - నాన్ ట్రైబల్ (89) ప్రాజెక్టు (90) సెల్లు ఫోన్ (92, 93, 94) ఫాక్స్ - టెలిగ్రామ్ (94) మమ్మీ డాడీ - ఆంటీ అంకుల్ (96) కాఫీ టీ - (100)
15-20 పద్యాలలో పదాలు ఆంగ్ల పద ప్రయోగం చేశారు.
అయితే ఆదివాసీలపై జరుగుతున్న జులుంను గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. (ప్రభుత్వానిదైనా - ప్రజా ప్రతినిధులదైనా)
మందుల కంపెనీలు తమ మందులకు (ఉత్పత్తులకు) గిరిజనుల శరీరాలను శాంపీళ్ళుగా (ప్రయోగాలకు) ఉపయోగించడం గురించి ఎక్కడా ప్రసావించలేదు. అంటే వివాదాస్పద అంశాల జోలికి పోకుండా శతకాన్ని పూర్తి చేశారు. దీనిని ఆగస్టు - 2016లో ప్రచురించారు. గిరిజన నృత్యాల ఒక గిరిజనుడు విలంబులను ప్రయోగిస్తూ ఉన్న ముఖ చిత్రంతో ఉన్న ఈ శతకం అందరికీ ఆదర్శం. తమ తమ అస్తిత్వాలతో రాయవలసిన సందర్భంలో ఇటువంటి శతకాలు రావడం ఆహ్వానించదగిన అంశం. కోసు ప్రసాదరావు తమ ఆదివాసి తెగల గురించి మరిన్ని రచనలు చేస్తారని ఆశిద్దాం.
సమీక్షకురాలు - జ్వలిత
9989198943
Email - jwalitha2020@gmail.com
--
చాలా బాగా వివరించారు.అడవితల్లి బిడ్డల నిజజీవన చిత్రానికి ప్రతిబింబం శతకం.కోసు ప్రసాదరావు గారు,జ్వలిత గారు..ఇద్దరికీ అభినందనలు....డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
రిప్లయితొలగించండి