హితురాలు భూమిక

'హితురాలు భూమిక'

జ్వలిత



భూమికతో నా అనుభవం నా జీవితంలా చాలా చిత్రమైంది. 1975లో పదోతరగతిలో పెళ్ళితో ఆగిపోయిన నా చదువు. ఇద్దరు సంతానం తర్వాత ఇంటర్ లేకుండా 1985లో హైదరాబాద్లో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీతో తిరిగి మొదలయ్యింది. తెలుగు పండిట్ ట్రైనింగ్ పూర్తిచేసి 1995లో నా 35వ ఏట ప్రభుత్వ ఉపాధ్యాయినిగా హైదరాబాదు నుండి సత్తుపల్లి చేరాను.1998లో ప్రమోషన్ పొంది రామవరం పాఠశాలకు చేరాను. చాలా పెద్ద ఆవరణ, పెద్దపెద్ద చెట్లతో, విశాలంగా సిమెంటు రేకుల షెడ్లతో, అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులున్న చారిత్రాత్మక పాఠశాలది. ఎందుకంటే 1960 ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. సింగరేణి బొగ్గుగనుల ప్రాంతం. విద్యార్థులు కూడా సింగరేణి కార్మికుల పిల్లలే ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలే ఎక్కువ. ఒక్క శాతం మిగిలిన వారి పిల్లలు. విచిత్రమైన వాతావరణం రాత్రిళ్ళు అధిక చలి, పగళ్ళు భయంకరమైన వేడి. మండే ఎండలు, వదలని ముసురు, వణికించే చలి అన్నీ ఎక్కువే. వాతావరణం వలెనే అక్కడి మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలలో కూడా మిగిలిన ప్రాంతాల్లో కంటె భిన్నంగా ఉండేవి.


ఒకే తండ్రి ముగ్గురు తల్లుల సంతానం ఒక తరగతి గదిలో విద్యార్థులుగా బద్ద శత్రువులుగా ఉండేవారు. కౌమార దశలో ఉన్న వారి మానసిక స్థితి కుటుంబ నేపధ్యం పిల్లలు చాలా వత్తిడికి లోనయ్యేవారు. మంచి తెలివైన వారైనా ఆ స్థితిలో గందరగోళంగా ఉండి, మా టీచర్లకు ఒక సవాల్ గా ఉండే వారు. కొందరు ఉపాధ్యాయిలు జీతం కోసమే పని చేస్తారు. కొందరు వృత్తి పరమైన విలువల కోసం పని చేస్తారు. ఇతర అవకాశాలున్నా అప్పటికే ఎల్.ఎల్.బి., పీ.జీ. పూర్తి చేసి 15 సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసి ఉన్న నేను కేవలం వృత్తి పట్ల గౌరవంతో కుటుంబాన్ని హైదరాబాద్లో వదిలి ఒంటరిగా ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఉద్యోగంలో చేరాను. చిన్నప్పటి నుండి ఉన్న పుస్తకాల పిచ్చి అదనంగా లభించిన ఏకాంత సమయం, బళ్ళో ఉన్న పెద్ద గ్రంథాలయం. మరొకసారి రోజుకు 6 గంటలు సాహిత్యం చదినే అవకాశం వచ్చింది. చదివినవి, చూస్తున్నవి దశాబ్దాల కాలాంతరాల్లో ఇంకా కొనసాగడం బెంగ కలిగించింది. కవిత్వంగా అక్షర రూపం దాల్చింది. కవుల పరిచయాలకు అవకాశం కలిగింది. కవి సమ్మేళనాలకు పిలిచిన పిలవక పోయినా హాజరయ్యేదాన్ని. సాహిత్యాంశాలకు నిజజీవితాలను అంచనా వేసుకునేదాన్ని. 2000 సంవత్సరంలో విజయవాడలో జరిగిన సభలో భూమిక పత్రిక ఇచ్చారు ఎవరో గుర్తులేదు. స్త్రీల కోసం పత్రిక మొదటి సారి చదివాను. చాలా నచ్చింది. అందులో విషయాలు విద్యార్థులతో పంచుకున్నాను. అప్పటి నుండి నేను భూమిక పాఠకురాలిని. అప్పటికే M.SC సైకాలజీ మొదలు పెట్టాను. ఫ్యామిలీ కౌన్సిల్ మెంబర్ గా కొత్తగూడెంలో ఆహ్వానం పొందాను.  చలం, రంగనాయకమ్మ రచనల ప్రభావంతో పాటు భూమిక పత్రిక స్త్రీల చట్టాల గురించి, స్త్రీల సమస్యల గురించి, బాలల హక్కుల గురించి అందించే సమాచారం ధైర్యం నాకు చాలా ఉపయోగ పడింది. 2005లో 'పారా లీగల్ వాలెంటైర్' గా శిక్షణ పొందడానికి స్పూర్తినిచ్చింది కూడా భూమికే.


మా కుటుంబంలో స్త్రీలెవ్వరూ ఇంతకు ముందు చెయ్యిని పనులు కవిత్వం రాయడం, లాయర్లు, డాక్టర్లు, పోలీస్ వారితో కలిసి ఎవరో కుటుంబ సమస్యలకు పరిష్కారం కోసం నేను పనిచెయ్యడం. నా కుటుంబంలో కొన్ని సమస్యలు కొన్ని అపోహలు సృష్టించింది. అందుకు స్త్రీ వాద రచయితలు కూడా కారణమయ్యారు.


2006లో "భూమిక నిర్వహించిన కథ, కవిత, వ్యాసరచనల పోటీలో నేను రాసిన 'మాయమవుతున్న మనసు' కథ తృతీయ బహుమతి పొందింది. అబ్బూరి ఛాయాదేవి, భార్గవి రావు, కొండవీటి సత్యవతిగార్ల చేతులమీదుగా బహుమతి అందుకున్నాను.

ఆ సంఘంటన నా సాహిత్య జీవితాన్ని నిర్ధేశించింది. నా జీవితానికి కొత్త ధైర్యాన్ని బలాన్నిచ్చింది. అప్పడి నుండి

ఎందరో బాధితులకు భూమిక నంబర్ ఇచ్చేదాన్ని. భూమిక రచయితల క్షేత్రస్థాయి పర్యటనలలో పాలు పంచుకునే అవకాశం రాలేదు. కానీ భూమిక నిర్వహించిన అనేక వర్క్ షాపులు హాజరయ్యాను. 2006లో సత్యవతి గారితో పరిచయం అయినా 2008 తర్వాత వారితో మాట్లాడ గలిగాను.

2007లో  పరివ్యాప్త సంకలనం కోసం పని చేస్తున్నప్పుడు, స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు నన్ను పిలిపించి 'భర్తలకు వ్యతిరేకంగా భార్యలను రెచ్చగొడుతూ ఏదో పుస్తకం రాస్తున్నారట, మీకెందుకండీ? పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్ళకు అవసరమా?' అంటూ సలహా వంటి హెచ్చరిక చేశాడు.  మా పాఠశాలలో ఉపాధ్యాయి వర్గం- అందులో మహిళా ఉపాధ్యాయినులు కూడా వారింటి చుట్టూ తిరుగుతుంటారని తెలిసింది తర్వాత. అయినా వదలకుండా GPFలోన్ తీసుకుని చేసిన సంకలనాన్ని సాహిత్యలోకం పక్కకు పెట్టింది. కానీ 'పరివ్యాప్త' పై శిలాలోలిత గారు రాసిన వ్యాసాన్ని భూమిక ప్రచురించింది, నాకెంతో ఆనందమనిపించింది.


2009లో బదిలీతో ఖమ్మం చేరాను. అనేక మంది బాధితులకు తెలంగాణ మాత్రమే కాదు తెలంగాణేతర కేసులకు కూడా సత్యవతి గారి సహాయం తీసుకున్నాను. నా సొంత సమస్యలకు భయం కలిగినా, బాధితులకు ధైర్యం చెప్పే క్రమంలో నేను కూడా ఊరట పొందాను. పాఠశాలలో టోల్ ఫ్రీ నంబరు విద్యార్థులకు అందుబాటులో ఉంచే దాన్ని. టోల్ ఫ్రీ నంబర్ లైబ్రరీ గోడకు అంటించాను. 'పాము కాటెయ్యికున్నా స్వీయ రక్షణ కోసం బుస కొట్టాలె' అనే సూత్రం విద్యార్థులకు ఉపయోగ పడేది. నేను గొంగడి పురుగుగా ఛీదరించ బడుతున్నప్పడి నుండి నన్ను నేను మలుచుకొని రెక్కలు మొలిపించుకొని 'బహుళ' రూపదారిననై సీతాకోక చిలుకనై విభిన్న వర్ణాలలో విభిన్న రంగాలలో పనిచేస్తున్నా. 'బహుళ పత్రిక' నిర్వహణకు ఎంతో ప్రేరణ ప్రోత్సాహాన్నందించింది భూమిక. నా వంటి ఎందరికో వెన్ను పూసలో మూలుగ వలె పైకి కనిపించకుండా జీవితాలను నిలబెడుతుంది భూమిక.

30 ఏళ్ళ భూమిక ప్రయాణంలో దాదాపు 23 ఏళ్ళ నుండి భూమిక నాకు హితురాలిగా భుజం తడుతూ వచ్చింది. భూమిక నుండి తీసుకున్నదే ఎక్కువ. ఇచ్చిందేమీ లేదు. ఇటువంటి పత్రికకు మనవంతు సహకారం  అందించడం కూడా సాహితీ లోకం బాధ్యత.


  • జ్వలిత- 9989198943.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ

సమూహం పై సమీక్ష